నర్తనశాల
వికీపీడియా నుండి
| నర్తనశాల (1963) | |
అప్పటి సినిమా పోస్టరు [1] |
|
|---|---|
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
| నిర్మాణం | సి.లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు |
| కథ | మహాభారతంలోని కధ - సముద్రాల రాఘవాచార్యచే కూర్పు |
| తారాగణం | నందమూరి తారక రామారావు- అర్జునుడు, బృహన్నల, సావిత్రి-ద్రౌపది, దండమూడి రాజగోపాలరావు- భీముడు, ఎస్.వి.రంగారావు-కీచకుడు, మిక్కిలినేని-ధర్మరాజు, రేలంగి - ఉత్తర కుమారుడు, ముక్కామల-విరాటరాజు, రాజనాల-దుర్యోధనుడు, ఎల్.విజయలక్ష్మి-ఉత్తర, సంధ్య-సుదేష్ణ, ధూళిపాల, ప్రభాకర రెడ్డి-కర్ణుడు, సూర్యకాతం, కాంచనమాల, అల్లు రామలింగయ్య, కాంతారావు - కృష్ణుడు, కైకాల సత్యనారాయణ - దుశ్శాసనుడు, శోభన్ బాబు - అభిమన్యుడు, వంగర, బాలకృష్ణ, సి.లక్ష్మీరాజ్యం, సీతారాం |
| సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
| నేపథ్య గానం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్.జానకి, బెంగుళూరు లత, ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల |
| నృత్యాలు | వెంపటి పెదసత్యం |
| సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
| ఛాయాగ్రహణం | ఎమ్.ఎ.రహమాన్ |
| కూర్పు | ఎస్.పి.ఎస్.వీరప్ప |
| నిర్మాణ సంస్థ | రాజ్యం పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగు సినిమా దర్శకులకున్న ప్రతిభను నర్తనశాల (Narthana Sala) సినిమా మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది.
విషయ సూచిక |
[మార్చు] కధ
మహాభారతంలోని 'విరాట పర్వం'లో జరిగిన పాండవుల అజ్ఞాతవాస గాధ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించి, తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే మరల వనవాసం పునరావృతమౌతుంది.
శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపైనుంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. ధర్మరాజు కంకుభట్టుగాను, భీముడు వంటలవాడు వలలునిగాను చేరుతారు. పేడివి కమ్మని ఎప్పుడో మేనక ఇచ్చిన శాపం అర్జునునకు ఇపుడు వరంగా మారుతుంది. అర్జునుడు బృహన్నలగా విరాటరాజు కుమార్తె ఉత్తరకు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు. ఇక నకుల సహదేవులు అశ్వపాలురుగా చేరుతారు. ద్రౌపది సైరంధ్రిగా విరాటరాజు భార్య సుదేష్ణాదేవి పరిచారిక అవుతుంది. అందరూ రాత్రివేళల నర్తనశాలలో కలసి కష్టసుఖాలు మాట్లాడుకొంటుంటారు.
ఇక పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని కౌరవులు చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు. మరొక ప్రక్క విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన కీచకుని కన్ను ద్రౌపదిపై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి భీముడు కీచకుని హతం చేస్తాడు.
కీచకుని మరణంతో అక్కడ పాండవులుండవచ్చునని అనుమానించిన కౌరవులు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. ఇక కలుగులో ఎలుకలను లాగడానికి కౌరవులు భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు.
అంతఃపుర పరివారం తప్ప అంతా యుద్ధానికి వెళ్ళారే! అయినా పరవాలేదు. నేను కౌరవ సేనను వీరోచితంగా జయిస్తానని పలికి విరాటుని కొడుకు ఉత్తర రాకుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. అతనికి సారధిగా బృహన్నల వెళతాడు. కాని కౌరవసేనను చూచి ఉత్తరునికి వణుకు మొదలై పారిపోజూస్తాడు. బృహన్నల అతనికి నచ్చచెప్పి, తన నిజ రూపం తెలిపి అర్జునుడుగా యుద్ధానికి వెళ్ళి, కౌరవసేనను సమ్మోహనాస్త్రంతో జయించి, గోవులను మళ్ళించుకు వస్తాడు.
శుభప్రదంగా పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది.
ఇతర సాంకేతిక నిపుణులు:
- కళ: ప్రతిభా శర్మ, టి.వి.ఎస్.శర్మ
- సహాయ దర్శకుడు - మాధవపెద్ది రామగోపాల్
- రికార్డింగ్ - ఎస్.రామారావు
[మార్చు] విశేషాలు
- రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన 11 సినిమాలలో 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.
- రాజ్యం పిక్చర్స్ అధినేతలలో ఒకరైన లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో నందమూరి సరసన హీరోయిన్గా నటించింది. తరువాత ఆమె వివాహం శ్రీధరరావుతో జరిగింది.
- బృహన్నలగా ఆడంగి వేషం వేయడానికి ఎన్.టి.ఆర్. మొదట నిరాకరించారు. కాని లక్ష్మీరాజ్యం ఆయనను ఒప్పించింది. అయితే ఎన్.టి.ఆర్. నిరాకరణకు కారణం ఆ పాత్ర రూపం కాదు. ఉత్తరగా మంచి నర్తకి అయిన విజయలక్ష్మితో సమానం తాను నాట్యం చేయలేనని. నెలరోజులు ఎన్.టి.ఆర్. తెల్లవారుజామున వెళ్ళి వెంపటి పెదసత్యం వద్ద నృత్యం నేర్చుకొన్నాడు. తరువాతే అంగీకరించాడు.
- బృహన్నల పాత్ర మేకప్ విషయమై మేకప్ మన్ హరిబాబు, కళాదర్శకుడు టి.వి.ఎన్.శర్మ ఎంతో శ్రమించారు. ఎబ్బెట్టుగా కాకుండా ఠీవిగా కనిపించేలా చేయడానికి ఎన్నో స్కతచ్లు వేశారు.
- కళాదర్శకుడు టి.వి.ఎన్.శర్మకు చిన్నపుడు ప్రమాదంలో ఒక చేయి పోయింది. కాని పట్టుదలతో శ్రమించి ఒకచేతి నైపుణ్యంతో కళాదర్శకుడయ్యాడు. జకార్తాలోని ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శింపబడగా శర్మకు ఉత్తమ కళాదర్శకుడు అవార్డు వచ్చింది. అప్పుడు ఆయనకు మద్రాసులో జరిగిన సన్మాన సభలో "నేను ఈ స్థాయికి చేరుకోడానికి కారణం ఎందరో మహానుభావులు. వారికి ఈ సందర్భంలో రెండుచేతులూ ఎత్తి దణ్ణం పెట్టుకొనే అవకాశం ఇవ్వలేదు ఆ భగవంతుడు" అన్నాడు.
- కీచకునిగా ఎస్.వీ.రంగారావు ఆ పాత్రకే వన్నె తెచ్చాడు. అయితే అదంతా సముద్రాల వ్రాసిన సంభాషణల బలమని చెప్పుకొన్నాడు ఆ వినయశీలి.
- 1964 లో జకార్తాలోని ఆఫ్రో ఆసియన్ ఫిలిమ్ ఫెస్టివల్కు లక్ష్మీ రాజ్యం, శ్రీధరరావు, ఎస్వీఆర్, రేలంగి హాజరయ్యారు. ఎస్వీఆర్ స్వయంగా సుకర్నో చేతులమీదుగా అవార్డు అందుకొన్నాడు. ఈ చిత్రం యూనిట్కి సుకర్నో విందు ఇవ్వడం మరోవిశేషం.
- అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రం పనిచేసిన విధం అద్భుతంగా చూపించారు. అస్త్రంపైన ఒక స్త్రీ ప్రత్యక్షమై కూర్చుండి, మత్తుమందు (పిచికారీలాంటి సాధనంతో) సైన్యంపై చల్లుతుంది. అంతా వివశులైనాక విజయవంతంగా అందరివంకా కలయజూస్తుంది.
- ఈ సినిమాలో అర్జునుడు యుద్ధానికి వెళుతూ శంఖం పూరిస్తున్న చిత్రాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టిన క్రొత్తలో ప్రచారానికి వాల్పోస్టరుగా వాడారు.
[మార్చు] పాటలు, పద్యాలు
- బావా బావా పన్నీరు - పి.సుశీల
- నరవరా ఓ కురువరా - ఎస్.జానకి
- ఎవరికోసం చెలి మందహాసం ఒకపరి వివరించవే సఖీ - ఘంటసాల, పి.సుశీల
- జననీ శివకామినీ, జయశుభకారిణీ, విజయ రూపిణీ - పి.సుశీల
- దరికి రాబోకు రాబోకు రాజా - పి.సుశీల
- సలలిత రాగసుధారససారం - డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బెంగళూరు లత
- సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి - పి.సుశీల
- అయితే ఈ సినిమా చివరి సన్నివేశంలో వాడిన భారతంలోని తిక్కన పద్యాలు ఎంతో వన్నె తెచ్చిపెట్టాయి. ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం పాడిన పద్యాలు కొన్ని
- దుర్వారోద్యమ బాహుబల
- కౌరవసేన జూచి వడకందొడగెన్
- కాంచనమయవేదికా
- సింగంబాకటితో గుహాంతరమున చేర్పాటుమైయుండి
- ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలరె
- ప్రేలితివెన్నొమార్లు కురువృద్ధులముందర
- పోటుమగండులా బుగిలపోయినవిల్లొకటి చేతబట్టి

