భూకైలాస్ (1958 సినిమా)
వికీపీడియా నుండి
ఇదే పేరుగల మరొక సినిమా కోసం భూకైలాస్ (1940 సినిమా) చూడండి.
| భూకైలాస్ (1958) | |
| దర్శకత్వం | కె.శంకర్ |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జమున |
| సంగీతం | ఆర్.సుదర్శనం, గోవర్ధన్ |
| నిర్మాణ సంస్థ | ఏ.వీ.ఎం.ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
తెలుగు సినిమా వైభవాన్ని చాటి చెప్పిన పలు నిర్మాణ సంస్థల్లో ఎ.వి.ఎం సంస్థ ఎన్నదగినది. ఆ సంస్థ నుండి ‘భక్తప్రహ్లాద’, ‘రాము’, ‘నోము’ వంటి ఎన్నో అత్యుత్తమ చిత్రాలు వచ్చాయి. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణిముత్యాల్లో అజరామరంగా నిలిచిపోయిన పౌరాణిక చిత్రం 1958లో విడుదలైన ‘భూకైలాస్’. నిజానికి అంతకుముందే ‘భూకైలాస్’ అనే నాటకం ఆధారంగా ఏ.వి.మొయ్యప్పన్ తెలుగులో ‘భూకైలాస్’ (1940) చిత్రాన్ని నిర్మించారు. అయితే, అందులో కొందరు మినహా దర్శకనిర్మాతల దగ్గర నుంచి నటీనటుల వరకు పలువురు కన్నడ, తమిళ పరిశ్రమకు చెందిన వారే కావడం గమనార్హం. ఆ తర్వాత ఇదే కథను ఎ.వి.ఎం. సంస్థ 1958లో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నిర్మించింది. ఆయా భాషలకు చెందిన మేటి నటీనటులతో మూడు భాషల్లో నిర్మించిన ‘భూకైలాస్’ చిత్రం అన్ని భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.
విషయ సూచిక |
[మార్చు] పాత్రలు
- రావణాసురుడు = ఎన్.టి.రామారావు
- నారదుడు = అక్కినేని నాగేశ్వరరావు
- మండోదరి = జమున
- మండోదరి తండ్రి = ఎస్.వి.రంగారావు
- రావణుని తల్లి = హేమలత
- పరమశివుడు = నాగభూషణం
[మార్చు] కథ
పరమశివుని భక్తుడైన రావణాసురుడు ఓ రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళ్తాడు. శివుని ఆత్మలింగం రావణుని వశమైతే సమస్త దేవతలు అతనికి ఊడిగం చెయక తప్పదని ఇంద్రుడు ఆందోళన చెందుతాడు. రావణుని తపస్సుకు భంగం కలిగించేందుకు విఫలయత్నం చేస్తాడు. చివరకు మహావిష్ణువును ఆశ్రయిస్తాడు. విష్ణు మాయ ఫలితంగా రావణాసురుడు ఆత్మలింగానికి బదులుగా పార్వతిని ఇమ్మని శివుణ్ణి కోరతాడు. రావణుని వెన్నంటి అనుసరించిన పార్వతికి మార్గమధ్యంలో నారదుడు ఎదురుపడి రావణుని తప్పించుకునే తరుణోపాయం చెబుతాడు. వనవిహారానికి వచ్చిన మండోదరిని రావణాసురునికి చూపించి అసలైన పార్వతి ఆమేనని నారదుడు నమ్మబలుకుతాడు. రావణుడు మండోదరిని అర్థాంగిగా చేసుకుంటాడు. ఆ క్రమంలో తనకు జరిగిన మోసాన్ని గ్రహించిన రావణుడు మళ్ళీ ఆత్మలింగం కోసం ఘోరతపస్సు చేస్తాడు. శివుని మెప్పించి ఆత్మలింగంతో తిరుగుముఖం పడతాడు. ఆత్మలింగంతో రావణుడు లంకకు చేరకుండా నారదుడు, విఘ్నేశ్వరుడు ఆటంకాలు కల్పిస్తారు. మార్గమధ్యంలో సంధ్యావందనం కోసమని ఆ ఆత్మలింగాన్ని బాలుడి వేషంలో ఉన్న విఘేశ్వరుని చేతికి రావణాసురుడు ఇస్తాడు. రావణుడు తిరిగి వచ్చేలోగా ఆ బాలుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచుతాడు. దానిని పెకిలించేందుకు రావణుడు చేసిన ప్రయత్నం వృథా అవుతుంది. ఆత్మార్పణకు సిధ్ధపడిన రావణాసురిని కైలాసపతి కరుణించి, ఆ ప్రదేశం ‘భూకైలాసం’గా మారుతుందని చెప్పి అనుగ్రహిస్తాడు.
[మార్చు] పాటలు
సముద్రాల రాఘువాచార్య రచనా సామర్థ్యానికి ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే ఒక్క పాట తార్కాణం గా నిలుస్తుంది. ఈ పాటలో రాముని అవతార వైశిష్ట్యాన్ని చూపించారు. ‘దేవదేవ ధవళాచల మందిర’, ‘జయజయమహాదేవా’, ‘తగునా వరమీయా ఈ నీతి దూరునకు..’ వంటి పాటలు ఘంటసాల వెంకటేశ్వరరావు గళంలో జీవం పోసుకున్నాయి. ‘సుందరాంగా అందుకోరా’, ‘మున్నీట పవళించు నాగశయనా’ వంటి పాటలు కూడా ఆణిముత్యాలే. ఆర్.సుదర్శనం, గోవర్థనం కలసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మరపురాని మనోజ్ఞ దృశ్యకావ్యంగా మలచిన ఘనత దర్శకుడు కె.శంకర్కు దక్కుతుంది.
[మార్చు] విశేషాలు
- ఈ ‘భూకైలాస్’ చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్కు హరికృష్ణ పుట్టారు.

