తెలుగు సాహిత్యము
వికీపీడియా నుండి
తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర వున్నది. నన్నయ్య రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు వున్నట్లు ఆధారాలు వున్నాయి. గాధా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన వున్నది.
విషయ సూచిక |
[మార్చు] ఉపోద్ఘాతము
తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికమైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం.
[మార్చు] చరిత్ర
కాలానుగుణ తెలుగు సాహితీ చరిత్ర కోసం తెలుగు సాహితీ చరిత్రను చూడండి. తెలుగు సాహితీకారుల గురించిన మరిన్ని వివరముల కోసం తెలుగు సాహితీ కారులను చూడండి.
క్రింది భాగం తెలుగు వ్యాసం నుండి ఇక్కడికి తాత్కాలికంగా కాపీ చేయబడింది.
ఇది తెలుగు సాహిత్యం గురించి ప్రధాన వ్యాసం గనుక దీనిని ఇక్కడ విస్తరించాలి.
తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.
[మార్చు] క్రీ.శ. 1020 వరకు - నన్నయకు ముందు కాలం
11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి కాని అని బహుశా గ్రంధస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.
[మార్చు] 1020-1400 - పురాణ యుగము
దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.
నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణఅలు ఆధారంగా వ్రాయబడ్డాయి.
[మార్చు] 1400-1510 -మధ్య యుగము (శ్రీనాధుని యుగము )
ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కధాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాధుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని "శృంగార నైషధం," పోతన "భాగవతం", జక్కన "విక్రమార్క చరిత్ర", తాళ్ళపాక తిమ్మక్క "సుభద్రా కల్యాణం", మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.
ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం.
[మార్చు] 1510-1600 - ప్రబంధ యుగము
విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన "ఆముక్తమాల్యద" తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.
[మార్చు] 1600-1820 - దాక్షిణాత్య యుగము
కర్నాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, మరియు క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.
[మార్చు] 1820 తరువాత - ఆధునిక యుగము
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లో సాధ్యమయ్యింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగంగారి "రాజశేఖరచరిత్రము" తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావుగారు. గిడుగు రామ్మూర్తి వారి "ముత్యాల సరాలు", కట్టమంచి రామలింగారెడ్డిగారి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకులు) "ముసలమ్మ మరణం", రాయప్రోలు సుబ్బారావుగారి "తృణకంకణం" మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం "వ్యావహారిక భాషా వాదా"నికి దారితీసింది.
(క్రింది భాగం పాత వ్యాసంలోనిది. దీనిని పై భాగంలో సందర్భానుసారంగా కలపాలి.)
తెలుగు సాహితీ చరిత్ర లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు.
- స్త్రీల కోకిల కంఠములలో, కర్షక శ్రామికుల స్వేదంలో, జానపదుల సంతోషములలో, తెలుగువారి ఘనమైన పండుగలలో తెలుగు సాహితీ చరిత్ర మొదలయింది.
- తరువాత క్రీ.శ తొమ్మిదవ శతాబ్దం నుండి శిలా శాసనాలకు ఎక్కింది.
- క్రీ.శ పదకొండవ శతాబ్దములో ఆదికవి నన్నయ్య చేతిలో, ఆంధ్ర మహాభారతం రూపంలో ఆదికావ్య రచన మొదలయింది.
- ఈ ఆంధ్ర మహాభారతాన్ని పద్నాలుగవ శతాబ్దాంతానికి తిక్కన, ఎర్రనలు పూర్తి చేసారు. ఈ ముగ్గురూ తెలుగు కవిత్రయము అని పేరుపొందినారు.
- పదమూడవ శతాబ్దంలో గోన బుద్దారెడ్డి రామాయణాన్ని తెలుగువారికి తెలుగులో అందించినారు.
- పద్నాలుగవ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడు భాగవతాన్ని తేట తెలుగులో రచించి, తెలుగువారిని ధన్యులను గావించారు.
- పోతన కు సమకాలికుడైన శ్రీనాథ కవిసార్వభౌముడు తన ప్రబంధాలతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసాడు.
- పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు భాషకు, పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.
- పదిహేనవ శతాబ్దంలోన ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
- పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పడిన ముప్పైరెండువేల పదాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం.
- క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాఅక సంగీతానికి ఆయువుపట్టు వంటివి.
- తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు"
- ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు.
[మార్చు] తెలుగు సాహితీ పద్దతులు
తెలుగుసాహిత్యములో ప్రపంచ సాహిత్యము లో వలెనే వివిధ రకరకాలైన పద్దతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు.
- జానపద సాహిత్యము
- వచన కవితా సాహిత్యము
- పద కవితా సాహిత్యము
- పద్య కవితా సాహిత్యము
- చంపూ సాహిత్యము
- శతక సాహిత్యము
- నవలా సాహిత్యము
- చిన్న కథలు
- అవధానములు
- ఆశుకవిత
- సినిమా సాహిత్యము
[మార్చు] ప్రముఖ కావ్యాలు
తెలుగులో వివిధ సాహిత్య రీతుల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎన్నో కావ్యాలు వచ్చాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
[మార్చు] ప్రస్తుత పరిస్థితి, ఓ అవలోకనం
ప్రస్తుతము విప్లవ సాహిత్యము, అవధానములు, ఇంటర్నెట్టు తెలుగు సాహిత్యము, వివిధ ఇజములుకు చెందిన సాహిత్యములు, నవలలు,టీ వీ సాహిత్యము, సినీ సాహిత్యము, రీ మిక్షులు, చిన్న కథలు,తెలుగు సాహిత్య ముఖ చిత్రాన్ని చాలా వరకు పూర్తి చేస్తున్నాయి
[మార్చు] భారతదేశ సాహిత్యంలో తెలుగు సాహిత్యపు స్థానం
[మార్చు] ప్రపంచ సాహిత్యంలో తెలుగు సాహిత్యపు స్థానం
[మార్చు] ఉపభాగములు
[మార్చు] చూడండి
తెలుగు సాహిత్యము|తెలుగు సాహితీకారులు|ప్రముఖ కావ్యాలు

