మహారాష్ట్ర

వికీపీడియా నుండి

మహారాష్ట్ర
Map of India with the location of మహారాష్ట్ర highlighted.
రాజధాని
 - Coordinates
ముంబై
 - 18.96° ఉ 72.82° తూ
పెద్ద నగరము ముంబై
జనాభా (2001)
 - జనసాంద్రత
96,752,247 (2nd)
 - 314.42/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
307,713 చ.కి.మీ (3rd)
 - 35
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1960-05-01
 - ఎస్.ఎం.కృష్ణ
 - విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
 - ద్విసభ (289 + 78)
అధికార బాష (లు) మరాఠీ
పొడిపదం (ISO) IN-MH
వెబ్‌సైటు: www.maharashtra.gov.in

మహారాష్ట్ర రాజముద్ర

మహారాష్ట్ర (Maharashtra), (మరాఠీ: महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం (ఉత్తరప్రదేశ్ తరవాతి స్థానం). మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం.

మహారాష్ట్ర ప్రాంతము ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశొక చక్రవర్తి శాసనాలలో రాష్ట్రీకముఅనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడినది. మహారాష్ట్రి అనే ప్రాకృతపదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహాకాంతార (అంటే పెద్ద అడవులు) అన్నపదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు. [1]. అయితే ఈ విశ్లేక్షణలకు బలమైన ఆధారాలు లేవు.


విషయ సూచిక

[మార్చు] చరిత్ర

 ఎల్లోరా గుహలలో శిల్పాలు
ఎల్లోరా గుహలలో శిల్పాలు

[మార్చు] ప్రాచీన, మధ్య యుగ చరిత్ర

మహారాష్ట్ర గురించి క్రీ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి. అప్పుడు మహారాష్ట్రి అనే భాషగురించి ప్రస్తావన జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం "దండకారణ్యం" అనబడింది. తరువాత అశోకుడు పాలించిన మగధ సామ్రాజ్యంలో మహారాష్ట్ర ఒక భాగమైంది. ఇప్పటి ముంబాయి నగరానికి ఉత్తరాన ఉన్న సోపార రేవు పట్టణంనుండి కొచ్చి(భారతదేశం) తోను, తూర్పు ఆఫ్రికా, మెసపొటేమియాలతోను వర్తక సంబంధాలుండేవి.


మౌర్యసామ్రాజ్యం పతనానంతరం క్రీ.పూ. 230 - క్రీ.శ.225 మధ్య మహారాష్ట్ర ప్రాంతం శాతవాహనసామ్రాజ్యంలో భాగమయ్యింది. ఈ కాలంలో ఇక్కడి సంస్కృతి, మరాఠీ భాష బాగా వృద్దిచెందాయి. క్రీ.శ. 78 ప్రాంతంలో పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి పేరు మీద శాలివాహన శకం ఆరంభమయ్యింది. క్రీ.శ. 3వ శతాబ్ది సమయంలో శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది.


క్రీ.శ. 250-525లో వాకాటకులు విదర్భ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో కళలు, సాంకేతిక పరిజ్ఞానము, నాగరికత బాగా వృద్ధిచెందాయి. 6వ శతాబ్దానికల్లా మహారాష్ట్ర ప్రాంతమును బాదామి చాళుక్యులు పాలించారు. 753వ సంవత్సరంలో రాష్ట్రకూటులు మహారాష్ట్రపాలకులయ్యారు. వారి సామ్రాజ్యం దాదాపు దక్కన్ అంతా విస్తరించింది. మరలా రాష్ట్రకూటులను ఓడించి బాదామి చాళుక్యులు 973-1189మధ్య మహారాష్ట్రలో కొంతభాగాన్ని పాలించారు. 1189 తరువాత దేవగిరి యాదవులు ఇక్కడి రాజులయ్యారు.

క్రీ.శ.13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకొన్నారు. మొదట అల్లాఉద్దీన్ ఖిల్జీ, ఆతరువాత ముహమ్మద్ బిన్ తుఘ్లక్ దక్కన్‌లో తమ అధికారాన్ని నెలకొలిపారు. 1347లో తుఘ్లక్‌ల రాజ్యం పతనమయినాక బీజాపూర్‌కు చెందిన బహమనీ సుల్తానులు తరువాత 150 సంవత్సరాలు ఇక్కడ రాజ్యం నెరపారు. 16వ శతాబ్దంనాటికి మహారాష్ట్ర మధ్యప్రాంతం ముఘల్ సామ్రాజ్యానికి అధీనులైన చిన్న చిన్న ముస్లిమ్‌రాజుల అధీనంలో ఉండేది. తీరప్రాంతంలో పోర్చుగీసువారు అధికారం చేజిక్కించుకొని, సుగంధ ద్రవ్యాల వర్తకం పై గుత్తాధిపత్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నారు.

[మార్చు] మరాఠాలు, పేష్వాలు

శివాజీ మహారాజు చిత్రం
శివాజీ మహారాజు చిత్రం

17వ శతాబ్దారంభంలో స్థానికులైన మరాఠాల నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం వ్రేళ్ళూనుకొనసాగింది. 1674లో శివాజీ భోన్సలే రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. శివాజీ మహారాజుగా ప్రసిద్ధుడైన ఈ నాయకుడు అప్పటి ముఘల్ ‌చక్రవర్తి ఔరంగజేబు సైన్యంతోను, బిజాపూర్ నవాబు ఆదిల్ షా సైన్యంతోను పలుయుద్ధాలు సాగించాడు. అప్పుడే మహారాష్ట్రలో తమఅధిపత్యాన్ని విస్తరిస్తున్న బ్రిటిష్‌వారితో కూడా కొన్ని చిన్న యుద్ధాలు చేశాడు. మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రసిద్ధుడైన, జనప్రియుడైన, పరిపాలనా దక్షతగల రాజుగా శివాజీని పేర్కొనవచ్చును.

1680దశకంలో శివాజీ కొడుకు శంభాజీ భోన్సలే ఔరంగజేబు చేత చిక్కి ఉరితీయబడ్డాడు. శంభాజీ తమ్ముడైన రాజారామ్ భోన్సలే తమిళప్రాంతానికి పారిపోయి "జింజీ కోట"లో తలదాచుకొన్నాడు. 18వ శతాబ్దంలో రాజారామ్ కాస్త బలపడిన సమయానికి పరిస్థితులు మారిపోయాయి.

శంభాజీ కొడుకు షాహు భోన్సలే అసలైన వారసునిగా, పినతల్లి తారాబాయితో కొంత ఘర్షణను ఎదుర్కొని, తన మంత్రి (పేష్వా)బాలాజీ విశ్వనాధ్ సహాయంతో సింహాసనం చేజిక్కించుకొన్నాడు. తరువాత 4దశాబ్దాలు భోన్సలేలు నామమాత్రంగా అధికారంలో ఉన్నారు పేష్వాలు నిజమైన అధికారాన్ని నెరపారు. ముఘల్‌లను ఓడించిన పేష్వాల అధికారం ఉత్తరాన పానిపట్‌నుండి దక్షిణాన తంజావూరు వరకు, గుజరాత్‌లోని మెహసనా నుండి మధ్య ప్రదేశ్‌‌లోని గ్వాలియర్, ఇండోర్‌ల వరకు విస్తరించింది.

బాలాజీ విశ్వనాధ్, అతని కొడుకు బాజీరావు పేష్వా‌లు వారిపాలనలో ఉన్న ప్రాంతంలో రెవిన్యూ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకు వారు ముఘల్ చక్రవర్తుల విధానాలను తమ స్వంత విధానాలతో జోడించారు. పేష్వాల కాలంలో వర్తకం, బ్యాంకింగ్ వ్యవస్థలు పటిష్టంగా అభివృద్ధిచెందాయి. వ్యవసాయం మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. పేష్వాలు పశ్చిమతీరంలో నౌకాభద్రతను అభివృద్ధిచేయసాగారు. అందుకై కొలాబాలో నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. నౌకాబలంమీద, సముద్ర వర్తకంమీద ఆధారపడిన పాశ్చాత్యదేశాల స్థావరాల అధిపత్యానికి ఇది కలవరపాటు కలిగించింది.


అదేసమయంలో మరాఠా ప్రాంతాలుకాని చోట్ల అధిపత్యం సామంతులకు కట్టబెట్టారు. అలా గ్వాలియర్‌లో సిండియాలు, ఇండోర్‌లో హోల్కర్‌లు, బరోడాలో గైక్వాడ్‌లు, ధార్‌లో పవార్‌లు స్థానిక రాజులయ్యారు.

1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో అఫ్ఘన్ సేనాని అహ్మద్‌షా అబ్దాలీ సైన్యంతో జరిగిన యుద్ధంలో మరాఠాలు దారుణంగా పరాజితులయ్యారు. దీనితో మరాఠా సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలయ్యింది. పూణేలో మాత్రం పేష్వాకుటుంబాల రాజ్యం కొనసాగింది. స్థానిక సంస్థానాధీశులు తమ రాజ్యాలను చక్కబెట్టుకొనసాగారు. భోన్సలేలకు దక్కన్‌లో సతారా కేంద్రమయ్యింది. వారి కుటుంబంలో రాజారామ్ వంశానికి చెందినవారు (1708లో షాహు అధికారాన్ని ఒప్పనివారు)మాత్రంకొల్హాపూర్‌లో స్థిరపడ్డారు. 19వ శతాబ్దారంభం వరకు కొల్హాపూర్‌లో వీరి పాలన సాగింది.

[మార్చు] బ్రిటిష్ రాజ్య కాలం

భారత రాజకీయాల్లోకి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రావడంతో వారికి, మరాఠాలకు పోరులు మొదలయ్యాయి. 1777-1818 మధ్య మూడు ఆంగ్ల-మరాఠా యుద్ధాలు జరిగాయి. తత్ఫలితంగా 1819నాటికి మహారాష్ట్రలో పేష్వాల పాలనలో ఉన్న భూభాగం ఆంగ్లేయుల పరమైంది. మరాఠా సామ్రాజ్యం అంతమైంది. బ్రిటిష్‌వారు ఈ ప్రాంతాన్ని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా పాలించారు. అది ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీనుండి ఉత్తర దక్కన్ వరకు విస్తరించి ఉండేది. చాలా మరాఠా రాజ్యాలు మాత్రం బ్రిటిష్ సామంతరాజ్యాలుగా మిగిలి ఉన్నాయి. వాటిలో నాగపూర్, సతారా, కొల్హాపూర్‌లు ముఖ్యమైనవి. 1848లో సతారా, 1853లో నాగపూర్, 1903లో బేరార్‌లు బ్రిటిష్ రాజ్యంలో కలిపివేయబడ్డాయి. మరాఠ్వాడా ప్రాంతం హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో భాగంగా ఉండేది.

బ్రిటిష్ కాలంలో సంఘ సంస్కరణలు ఊపందుకొన్నాయి. మౌలిక సదుపాయాలు కొంత మెరుగు పడినాయి. క్రమంగా తిరుగుబాటులు మొదలయ్యఅయి. 20వ శతాబ్దం ఆరంభంలో బాల గంగాధర తిలక్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య పోరాటం వ్రేళ్ళూనుకొంది. తరువాత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఇది అహింసాయుత పోరాటంగా విస్తరించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది.

[మార్చు] స్వాతంత్ర్యం తరువాత

1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

[మార్చు] భౌగోళికం

మహారాష్ట్రలో పర్వతాలు
మహారాష్ట్రలో పర్వతాలు

మహారాష్ట్ర వైశాల్యం 308,000 చ.కి.మీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల తరువాత ఇది పెద్ద రాష్ట్రం.

తీర ప్రాంతానికి సమాంతరంగా ఉన్న పడమటి కనుమలు సగటు ఎత్తు 1,200 మీటర్లు. వాటికి పశ్చిమాన కొంకణ్ తీరభూమి మైదానం ఉంది. పడమటి కనుమలకు తూర్పున దక్కన్ పీఠభూమి ఉంది. తమ్హిని ఘాట్, వరంధ ఘాట్, సవంత్‌వాడి ఘాట్ - ఇవి పడమటి కనుమలలో విభాగాల పేర్లు. పడమటి కనుమలు భారతదేశంలో మూడు watershed ప్రాంతాలలో ఒకటి. దక్షిణబారతదేశపు ముఖ్యమైన నదులు చాలా పడమటికనుమలలో పుడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ - ఇవి తూర్పువైపుకు ప్రవహించి బంగాళా ఖాతంలో కలుస్తయి. మహారాష్ట్ర మధ్య, తూర్పు ప్రాంతాలకు ఇవి ప్రధాన నీటి వనరులు. ఇంకా పడమటి కనుమలలో చాలా చిన్న నదులు పడమటివైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయు.

మహారాష్ట్రకు ఉత్తరాన, మధ్యప్రదేశ్ సరిహద్దులలో సాత్పూరా పర్వతశ్రేణులున్నాయి.

నర్మద, తపతి నదులు మహారాష్ట్ర ఉత్తరభాగంలో నీటి వనరులు. ఇవి పడమటివైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. వైన గంగ వంటి నదులు దక్షిణదిశగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక బహుళార్ధ సాధక ప్రాజెక్టులున్నాయి.

దక్కన్ పీఠభూమిలో చాలాభాగం నల్లరేగడినేల. ప్రత్తి వ్యవసాయానికి అనుకూలమైనది.

[మార్చు] అభయారణ్యాలు

మహారాష్ట్ర ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (wildlife sanctuaries), జాతీయ ఉద్యానవనాలు(national parks), ప్రాజెక్ట్ టైగర్ (Project Tiger)ఏర్పాటు చేయ బడ్డాయి. 2004 మే నాటికి మొత్తం దేశంలో 92 జాతీయ ఉద్యానవనాలుండగా వాటిలో 5 మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కువ అటవీ ప్రాంతం విదర్భలో ఉన్నది. అక్కడ ఉన్న జాతీయ ఉద్యానవనాలు

  • గుగమల్ నేషనల్ పార్కు, దీనినే మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు - ఇది విదర్భ ప్రాంతంలో అమరావతి జిల్లాలో ఉన్నది.
  • నవీగావ్ నేషనల్ పార్కు - విదర్భ ప్రాంతంలో నాగపూర్ దగ్గర - పలు జాతుల పక్షులకు, లేళ్ళకు, ఎలుగుబంట్లకు, చిరుతలకు ఆవాసం.
  • పెంచ్ నేషనల్ పార్కు - నాగపూర్ జిల్లాలో ఉన్నది. ఈ పార్కు మధ్యప్రదేశ్‌లో కూడా విస్తరించింది. దీనిని టైగర్ ప్రాజెక్టుగా వృద్ధిపరచారు.
  • సంజయ్ గాంధీ నేషనల్ పార్కు - దీనినే బోరివిలి నేషనల్ పార్కు అంటారు. ముంబాయి నగరంలో ఉన్నది. నగర పరిధిలో ఉన్న నేషనల్ పార్కులతో పోలిస్తే ప్రపంచంలో పెద్దది.
  • తడోబా అంధారి టైగర్ ప్రాజెక్టు - విదర్భలో చంద్రాపూర్ వద్ద - ఇది ఒక ప్రముఖ టైగర్ ప్రాజెక్టు.

ఇవికాక మహారాష్ట్రలో 35 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. [1] వాటిలో నాగ్‌జిరా (భంద్రా జిల్లా), ఫన్సాద్, కొన్యా అభయారణ్యాలు ముఖ్యమైనవి.

[మార్చు] ఆర్ధిక వ్యవస్థ

[మార్చు] స్థూల ఉత్పత్తి

మహారాష్ట్ర స్థూల రాష్ట్రోత్పత్తి వివరాలు (మార్కెట్ ధరల ఆధారంగా, కోట్ల రూపాయలలో) క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. భారత ప్రభుత్వం గణాంకవిభాగం అంచనా.

సంవత్సరం స్థూల రాష్ట్రోత్పత్తి (కోట్ల రూ.)
1980 1,663.1
1985 2,961.6
1990 6,443.3
1995 15,781.8
2000 23,867.2

2004లో మహారాష్ట్ర స్థూలాదాయం 106 బిలియన్ డాలర్లు అని అంచనా.

[మార్చు] ప్రభుత్వం ఆదాయవనరులు

మహారాష్ట్ర ప్రభుత్వపు పన్ను ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) క్రింద చూపబడ్డాయి. [2]

సంవత్సరం పన్ను ఆదాయం (కోట్ల రూపాయలు)
2000 19,882.1
2005 33,247.6

పన్నుల ద్వారా కాకుండా , కేంద్రం నుండి వచ్చే వాటఅను మినహాయించి, వచ్చే ఆదాయ వివరాలు [3]

సంవత్సరం ఆదాయం (కోట్ల రూపాయలు)- పన్నులు కాక
2000 2,603.0
2005 3,053.6

[మార్చు] పరిశ్రమలు

1970దశకంలో అవలంబించిన ఆర్ధిక విధానాల ఫలితంగా భారతదేశంలో పారిశ్రామికంగా మహారాష్ట్ర బాగా అభివృద్ధి చెందింది. గుజరాత్ తరువాత మహారాష్ట్ర దేశంలో అత్యధిక పారిశ్రామిక రాష్ట్రం. ముంబాయి నగరంతో సహా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఆ ప్రాంతంవారు అన్ని అవకాశాలను చేజిక్కించుకొంటున్నారన్న అభిప్రాయం విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ప్రాంతంలో ప్రబలంగా ఉన్నది. విదర్భ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్యమం కూడా ఉన్నది.

మొత్తం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులలో 13% మహారాష్ట్రనుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో 64% ప్రజలు వ్యవసాయ, సంబంధిత వృత్తులపై ఆధారపడి ఉన్నారు. కాని స్థూల రాష్ట్రాదాయంలో 46% పరిశ్రమలనుండే వస్తున్నది.

దేశంలో మొదటి 500 వ్యాపార సంస్థలలో 41% పైగా సంస్థలు (Over 41% of the S&P CNX 500 conglomerates) వాటి ప్రధాన కార్యాలయాలను మహారాష్ట్రలో కలిగి ఉన్నాయి.

మహారాష్ట్రలో ముఖ్యమైన పరిశ్రమలు:

  • రసాయన, అనుబంధ పరిశ్రమలు
  • విద్యుత్ పరికరాలు, యంత్రాలు
  • యంత్ర భాగాలు
  • వస్త్ర పరిశ్రమ
  • ఔషధాలు
  • పెట్రోలియం ఉత్పత్తులు
  • పానీయాలు
  • ఆభరణాలు
  • ఇంజినీరింగ్ ఉత్పత్తులు
  • ఇనుము, ఉక్కు
  • ప్లాస్టిక్ ఉత్పత్తులు

[మార్చు] వ్యవసాయం

మహారాష్ట్రలో ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు

  • మామిడి
  • ద్రాక్ష
  • నారింజ
  • వరి
  • గోధుమ
  • జొన్న
  • సజ్జ
  • పప్పు ధాన్యాలు
  • వేరు శనగ
  • ప్రత్తి
  • చెఱకు
  • పసుపు
  • పుగాకు

మొత్తం రాష్ట్రంలో నీటివనరులున్న భూమి 33,500 చ.కి.మీ.

[మార్చు] బ్యాంకింగ్, సినిమాలు

భారతదేశానికి ఆర్ధిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు. దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు, భీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబాయ నగరంలో ఉన్నాయి. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది ఆసియాలో అత్యంత పురాతనమైనది.

ముంబాయిలో సినిమా పరిశ్రమను బాలీవుడ్ అని చమత్కరిస్తుంటారు. (అమెరికాలోని హాలీవుడ్ను పురస్కరించికొని). హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమకు ఇది ప్రధాన కేంద్రం.

ఇటీవల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ ఊపందుకొంటున్నది. పూణే, నాగపూర్, ముంబాయి, నాసిక్ లలో సాఫ్ట్‌వేర్ పార్కులు నెలకొలుపబడ్డాయి.

బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తు (దేశంలో 13%), అణు విద్యుత్తు (దేశంలో 17%) - ఈ రెండింటిలోనూ మహారాష్ట్రదే దేశంలో అగ్రస్థానం.


ఇటీవల జత్రోపా వ్యవసాయం మహారాష్ట్రలో విస్తరిస్తున్నది. [4]

రాలెగావ్ సిద్ధి అనే వూరు అహమ్మద్ నగర్ జిల్లాలో ఉన్నది. పర్యావరణ సంరక్షణ ఈ వూరు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నది. [5]

[మార్చు] పరిపాలన

 మహారాష్ట్ర శాసన, పాలనా భవనం (మంత్రాలయ్)
మహారాష్ట్ర శాసన, పాలనా భవనం (మంత్రాలయ్)

మహారాష్ట్ర పాలనా వ్యవస్థ అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది. రాజధాని ముంబాయి నగరం. ప్రధాన న్యాయ స్థానం బొంబాయి హైకోర్టు మహారాష్ట్రకు, గోవాకు, డామన్-డయ్యు కు కూడా హైకోర్టుగా వ్యవహరిస్తుంది.

శాసన సభ బడ్జెట్, వర్షాకాలపు సమావేశాలు ముంబాయిలోను, శీతాకాలపు సమావేశాలు నాగపూర్‌లోను జరుగుతాయి. నాగపూర్‌ నగరం రాష్ట్రానికి ద్వితీయ రాజధాని అని వ్యవహరిస్తారు.

మహారాష్ట్ర శాసనసభలో విధాన సభ (అసెంబ్లీ), విధాన పరిషత్ (కౌన్సిల్) అనె రెండు సభలున్నాయి. మహహారాష్ట్రకు లోక్‌సభలో 48 స్థానాలు, రాజ్యసభలో 19 స్థానాలు ఉన్నాయి.


స్వాతంత్ర్యం తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్రను చేజిక్కించుకొంటూ వచ్చింది. 1995వరకూ వారికి బలమైన ప్రత్యర్ధులు లేరు. ఈ కాలంలో వై.బి.చవన్ ప్రముఖ కాంగ్రెసు నాయకుడు. 1995లో బాలథాకరే అధ్వర్యంలోని శివసేన, భారతీయ జనతా పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత శరద్ పవార్ ప్రారంభించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరొక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. 2004 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

[మార్చు] జనవిస్తరణ

మహారాష్ట్ర స్థానికులను మహారాష్ట్రియన్ అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 96,752,247. ఇందులో మరాఠీ మాతృభాషగా ఉన్నవారు 62,481,681. రాష్ట్రం జనసాంద్రత చ.కి.మీ.కు 322.5. రాష్ట్రజనాభాలో పురుషులు 5.03 కోట్లు, స్త్రీలు 4.64 కోట్లు. ఆడ, మగ నిష్పత్తి 922/1000. పట్టణ జనాభా 42.4 %. అక్షరాస్యులు 77.27%. స్రీలలో అక్షరాస్యత 67.5%, పురుషులలో 86.2%. 1991-2001 మధ్య జనాభా వృద్ధిరేటు 22.57%.


అధికార భాష మరాఠీ. పెద్ద నగరమైన ముంబాయిలో మరాఠీతో బాటు హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలు విస్తారంగా మాట్లాడుతారు. రాష్ట్ర వాయువ్యప్రాంతంలో అహిరాణి అనే మాండలికం కొద్దిమంది మాట్లాడుతారు. దక్షిణ కొంకణ ప్రాంతంలో మాల్వాణి అని పిలువబడే కొంకణి భాషమాండలికం మాట్లాడుతారు. దీనిని మరాఠీ భాష మాండలికం అనికూడా అనవచ్చు. దక్కన్ అంతర్భాగంలో దేశ భాషి అనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు. విదర్భ ప్రాంతంలో వర్హాదిఅనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు.


మతపరంగా హిందువులు 80.2%, ముస్లిములు10.6%, బౌద్ధులు 6%, జైనులు 1.3%, క్రైస్తవులు 1% ఉన్నారు. భారతదేశంలో అత్యధిక జైన, జోరాస్ట్రియన్ (పార్సీ), యూదు జనాభా మహారాష్ట్రలోనే ఉన్నారు.

[మార్చు] విభాగాలు, జిల్లాలు

ప్రధాన వ్యాసం: మహారాష్ట్ర జిల్లాలు

మహారాష్ట్రలోని 35 జిల్లాలని 6 విభాగాలు (డివిజన్లు)గా విభజిస్తారు.

  1. ఔరంగాబాదు విభాగం
  2. అమరావతి విభాగం
  3. కొంకణ విభాగం
  4. నాగపూర్ విభాగం
  5. నాసిక్ విభాగం
  6. పూణె విభాగం

భౌగోళికంగానూ, చారిత్రికంగానూ, రాజకీయ భావాలను బట్టీ మహారాష్ట్రలో 5 ముఖ్యప్రాంతాలను గుర్తింపవచ్చును.

  • విదర్భ లేదా బేరార్ - నాగపూర్, అమరావతి విభాగఅలు కలిపి
  • మరాఠ్వాడా- ఔరంగాబాదు విభాగం, ఖాందేశ్, ఉత్తర మహారాష్ట్ర (నాసిక్)
  • దేశ్ లేదా పశ్చిమ మహారాష్ట్ర - పూణె విభాగం
  • కొంకణ ప్రాంతం


రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
MH AH అహ్మద్‌నగర్ అహ్మద్‌నగర్ 4088077 17048 240
MH AK అకోలా అకోలా 1629305 5429 300
MH AM అమరావతి అమరావతి 2606063 12235 213
MH AU ఔరంగాబాదు ఔరంగాబాదు 2920548 10107 289
MH BH భందరా భందరా 1135835 3890 292
MH BI బిద్ బిద్ 2159841 10693 202
MH BU బుల్ధనా బుల్ధనా 2226328 9661 230
MH CH చంద్రపూర్ చంద్రపూర్ 2077909 11443 182
MH DH ధూలే ధూలే 1708993 8095 211
MH GA గడ్‌చిరోలి గడ్‌చిరోలి 969960 14412 67
MH GO గొండియా గొండియా 1200151 5431 221
MH HI హింగోలి హింగోలి 986717 4526 218
MH JG జలగావ్ జలగావ్ 3679936 11765 313
MH JN జల్నా జల్నా 1612357 7718 209
MH KO కొల్హాపూర్ కొల్హాపూర్ 3515413 7685 457
MH LA లాతూర్ లాతూర్ 2078237 7157 290
MH MC ముంబై నగరం 3326837 69 48215
MH MU ముంబై పరిసరం భంద్రా (తూర్పు) 8587561 534 16082
MH NB నందుర్బర్ నందుర్బర్ 1309135 5055 259
MH ND నాందేడ్ నాందేడ్ 2868158 10528 272
MH NG నాగపూర్ నాగపూర్ 4051444 9892 410
MH NS నాశిక్ నాశిక్ 4987923 15539 321
MH OS ఉస్మానాబాద్ ఉస్మానాబాద్ 1472256 7569 195
MH PA పర్భని పర్భని 1491109 6511 229
MH PU పూణె పూణె 7224224 15643 462
MH RG రాయిఘర్ ఆలీబాగ్ 2205972 7152 308
MH RT రత్నగిరి రత్నగిరి 1696482 8208 207
MH SI సింధుదుర్గ్ ఒరాస్ 861672 5207 165
MH SN సంగ్లీ సంగ్లీ 2581835 8572 301
MH SO షోలాపూర్ షోలాపూర్ 3855383 14895 259
MH ST సతారా సతారా 2796906 10475 267
MH TH థానె థానె 8128833 9558 850
MH WR వార్ధా వార్ధా 1230640 6309 195
MH WS వషిమ్ వషిమ్ 1019725 5155 198
MH YA యవత్‌మల్ యవత్‌మల్ 2460482 13582 181

[మార్చు] రవాణా వ్యవస్థ

 ముంబయి-పూణె ఎక్స్‌ప్రెస్ రహదారి
ముంబయి-పూణె ఎక్స్‌ప్రెస్ రహదారి

మహారాష్ట్రలో అధికభాగంలో భారతీయ రైల్వే వారి రవాణా సదుపాయం విస్తరించి ఉన్నది. రైలు ప్రయాణం బాగా సామాన్యం. ముంబాయి కేంద్రంగా సెంట్రల్ రైల్వే ఎక్కువ భాగంలో ఉండగా, దక్షిణతీర ప్రాంతంలో కొకంణ్ రైల్వే ఉన్నది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (MSRTC) వారి బస్సు రవాణా దాదాపు అన్ని పట్టణాలకు, గ్రామాలకు విస్తరించి ఉన్నది. ఇంకా ప్రైవేటు రవాణా వ్యవస్థ కూడా దూరప్రయాణాలకు వాడుతుంటారు.

ముంబాయిలో పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. పూణె, నాగపూర్‌ల‌లో కూడా చిన్న అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. రత్నగిరి, కొల్హాపూర్, నాశిక్‌లలో విమానాశ్రయాలున్నాయి. ఫెర్రీ సర్వీసులు తీర ప్రాంత పట్టణాల మధ్య ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ప్రమాణాలతో, టోల్‌గేటు ద్వారా అనుమతి లభించే పూణె-బొంబాయి ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు.

ముంబాయి నగరంలో మూడు నౌకాశ్రయాలు ఉన్నాయి - ముంబాయి, నవసేన, రత్నగిరి.

[మార్చు] సంస్కృతి

మహారాష్ట్ర సంస్కృతి అన్ని మతాల, వర్గాల జీవనశైలికి కలయికగా రూపు దిద్దుకొంది. అత్యధిక సంఖ్యాక జనులు హిందువులైనందున మహారాష్ట్ర సంస్కృతిలో ఆ ప్రభావం కనిపిస్తుంది.


మహారాష్ట్రలో చాలా పురాతనమైన మందిరాలున్నాయి. ఇక్కడి మందిరాలలో ఉత్తర, దక్షిణ భారతాల నిర్మాణశైలుల కలయిక ప్రతిబింబిస్తుంది. ఇంకా హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల మేళవింపు మందిరాల్లోనూ, ఆచారాల్లోనూ చూడవచ్చును. మహారాష్ట్రలోని మందిరాలలో పండరిపూర్‌లోని విఠలుని ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. [[|అజంతా గుహలు|అజంతా ]]చిత్రాలు,ఎల్లోరాశిల్పాలు, ఔరంగాబాదు మసీదు ప్రసిద్ధ పర్యాటక స్థలాలు. ఇంకా రాయగఢ్, ప్రతాప్‌గఢ్, సింధుదుర్గ్ వంటి కోటలు కూడా చూడదగినవి.

గోంధల్, లవని, భరుద్, పొవడా వంటివి మహారాష్ట్ర జానపదసంగీత విధానాలు.


ధ్యానేశ్వరుడు రచించిన "భావార్ధ దీపిక" (ధ్యానేశ్వరి) మరాఠీ సాహిత్యంలో మొదటి రచనలలో ఒకటి. ధ్యానేశ్వరుడు, తుకారామ్, నామదేవ్ వంటి భక్తుల భజన, భక్తి గీతాలు జనప్రియమైనవి. ఆధునిక మరాఠీ రచయితలలో కొఒందరు ప్రముఖులు - పి.యల్.దేశ్‌పాండే, కుససుమగ్‌రాజ్, ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే, వ్యాకంతేష్ మద్‌గుల్కర్.

నాటక రంగం, సినిమా పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమ - మూడూ బొంబాయి నగరంలో కేంద్రీకృతమైనాయి. నటీనటులు, సాంకేతికనిపుణులు, కళాకారులు ఈ మూడు రంగాలలో ఒకదానినుండి మరొకదానికి మారడం సర్వసాధారణం.

మహారాష్ట్ర వినోదరంగంలో కొందరు ప్రముఖులు:

  • దాదా సాహెబ్ ఫాల్కే - బారత సినిమా పరిశ్రమకు పితామహుడు
  • పి.యల్.దేశ్‌పాండే - రచయిత, దర్శకుడు, నటుడు
  • అశోక్ సరఫ్ - నటుడు
  • లక్ష్మీకాంత్ బెర్దే - నటుడు
  • సచిన్ పిలగావ్‌కర్ - నటుడు, నిర్మాత
  • మహేష్ కొథారె - నటుడు, నిర్మాత
  • వి.శాంతారామ్ - నటుఉ, దర్శకుడు, నిర్మాత
  • కొల్హాట్కర్ - నాటక రచయిత
  • దేవల్ - నాటక రచయిత
  • గడ్‌కారి - నాటక రచయిత
  • కిర్లోస్కర్ - నాటక రచయిత
  • బాల గంధర్వ - రంగస్థల నటుడు
  • కేశవరావు భోన్సలే - రంగస్థల నటుడు
  • భావురావ్ కొల్హాట్కర్ - రంగస్థల నటుడు
  • దీనానాధ్ మంగేష్కర్ - రంగస్థల నటుడు

మహారాష్ట్ర వంటకాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కొకణతీరంలో వరిఅన్నం, చేపలు ప్రధాన ఆహారపదార్ధాలు. తూర్పు మహారాష్ట్రలో గోధుమ,జొన్న, సజ్జలతో చేసిన పదార్ధాలు ఎక్కువ తింటారు. పప్పులు, ఉల్లి, టొమాటో, బంగాళదుంప, అల్లం, వెల్లుల్లి వంటివి అన్నిచోట్లా వాడుతారు. కోడి, మేక మాంసాల వాడకం కూడా బాగా ఎక్కువ.

సాంప్రదాయికంగా ఆడువారు 9 అడుగుల చీర ధరిస్తారు. మగవారు ధోతీ, పైజమా ధరిస్తారు. ఇప్పుడు ఆడువారికి సల్వార్-కమీజ్, మగవారికి ప్యాంటు-షర్టు సాధారణ దుస్తులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో.

భారతదేశమంతటిలాగానే క్రికెట్ అత్యంత జనప్రియమైన ఆట. గ్రామీణ ఆటలలో కబడ్డి, విట్టి-దండు, గిల్లి-దండా, పకడా-పకడీ ఆటలు సామాన్యం.


మహారాష్ట్రలో ముఖ్యమైన పండుగలు: గుడి-పడవఅ, దీపావళి, రంగపంచమి, గోకులాష్టమి, వినాయక చవితి (గణేషోత్సవం) - గణేషోత్సవం బాగఅ పెద్ద ఎత్తున జరుపుతారు. ఈ ఊరేగింపులు దేశంలో అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ఆషాఢమాసంలో పండరిపూర్‌కు వందలాదికిలోమీటర్లు పాదయాత్రలు చేయడం ఒక సంప్రదాయం.

[మార్చు] రిఫరెన్సులు

  1. Geographic Profile — Govt of Maharashtra
  2. Twelfth Finance Commission. Finance Commission of India. Retrieved on 2006-09-19.
  3. Twelfth Finance Commission. Finance Commission of India. Retrieved on 2006-09-19.
  4. Identification of suitable sites for Jatropha plantation in Maharashtra using remote sensing and GIS. University of Pune. Retrieved on 2006-11-15.
  5. A model Indian village- Ralegaon Siddhi. Retrieved on 2006-10-30.

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] బయటి లింకులు





భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు Flag of India
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ