పొలాస
వికీపీడియా నుండి
పొలాస కరీంనగర్ జిల్లా, జగిత్యాల మండలానికి చెందిన గ్రామము. రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల శాసనాలలో పౌలస్త్యాశ్రమ పట్టణంగానూ, పొలవాసదేశంగాను, పౌలస్త్యేశ్వరపురం గాను ప్రముఖంగా పేర్కొనబడిన చరిత్రాత్మకమైన స్థలం ఇది. పొలాస సంస్కృత పండితులకు నిలయంగా, వేదాధ్యనయ కేంద్రంగా విలసిల్లినట్టుగా కూడా ఆధారాలున్నాయి.
1980లో ఆచార్య ఎన్. జి. రంగా అగ్రికల్చర్ యూనివెర్సిటీ వారు ఒక వ్యవసాయిక పరిశోధనా సంస్థని ఇక్కడ ఏర్పాటు చేసారు.
[మార్చు] స్థల నామ వ్యుత్పత్తి
ఈ గ్రామంలో వెలసిన పౌలస్త్యేశ్వర స్వామి పేరు ఆధారంగా పొలాస అన్న పేరు స్థిరపడిందన్న నమ్మకం ఈ ప్రాంతంలో ప్రచురంగా ఉంది. కాని, ఇది జానపద వ్యుత్పత్తిగా, ఆ రోజుల్లో సర్వ సాధారణమైన సంస్కృతీకరణకు దృష్టాంతంగా చూపవచ్చు.అదీకాక, పట్టణము,స్థలము అన్న అర్థాలన్న *పోళ-, పొల-, ప్రోల- మొదలైన మూల ద్రావిడ ధాతువుల ద్వారా ఈ స్థలనామ వ్యుత్పత్తిని ఆవిష్కరించడం తేలిక.
[మార్చు] నైసర్గిక స్వరూపం
పొలాస 18.9° ఉత్తర అక్షాంశ రేఖ, 79.03° తూర్పు రేఖాంశ రేఖల వద్ద విస్తరించి సముద్ర మట్టానికి 264 మీటర్ల ఎత్తులో ఉన్నది.
[మార్చు] చరిత్ర
పొలాస రాజధానిగా మేడరాజు (1080-1110) పొలవాసదేశాన్ని పాలించే వాడని 12వ శతాబ్దపు శాసనాల వల్ల మనకు తెలుస్తోంది. 1108 లో రాయించిన ఒక శాసనంలో మేడరాజును మహామండలేశ్వర-మేడ-క్ష్మాపతి గా వర్ణిస్తూ లత్తలూరు-పుర-వరాధీశ్వర, సువర్ణ గరుడధ్వజ మొదలగునవి ఇతని బిరుదులుగా పేర్కొనడం రాష్ట్రకూటులతో ఇతని అనుబంధాన్ని తెలుపుతుంది. ఈ ప్రాంతాన్ని ఇతని కొడుకు జగ్గదేవ 1110-1116 సం. మధ్య పరిపాలించాడు. జగ్గదేవుని మరణానంతరం రాజైన మేడరాజు II ఆనాటి కాకతీయ ప్రభువైన ప్రోల II (1083 - 1158)కు సామంతునిగా ఉండేవాడు. కానీ 1158లో రాజ్యాభిషక్తుడైన కాకతీయ యువరాజు రుద్రునిపై మేడరాజుII తిరగుబాటు చెయ్యడంతో ఉగ్రుడైన రుద్రుడు, తన సైన్యంతో తరలివచ్చి మేడరాజుని ఓడించాడు.ఆ యుద్ధానంతరం రుద్రుడు పొలాస నగరాన్ని తగులబెట్టించాడట. 1159 నుండీ పొలవాసదేశం కాకతీయుల ఆధీనంలో ఉంది. కాకతీయుల కళావైభవాన్ని చాటిచెప్పే త్రికూటాకారపు పౌలస్త్యేశ్వరాలయం 14వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి కాలంలో కట్టినట్టు శాసనాధారాలు ఉన్నాయి.

