ఆయుర్వేదము
వికీపీడియా నుండి
ఆయుర్వేదం అనునది ప్రపంచములోని అన్ని వైద్య విధానాలలోకెల్లా అత్యంత పురాతనమైన వైద్య విధానం.ఇది అధర్వణ వేదమునకు ఉపవేదం.ఇట్టి ఆయుర్వేదం బ్రహ్మ ముఖము నుండి స్వయంసిద్ధంగా ఉద్భవించింది. దక్ష ప్రజాపతి ఆయుర్వేదమును బ్రహ్మ నుండి నేర్చుకొనెను. తర్వాత దక్షుని నుండి అశ్విని దేవతలు అను ఇరువురు దేవ వైద్యులు ఆ ఆయుర్వేదమును గ్రహించిరి. వారి ద్వారా ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకొనెను.ధర్మమును సాధించుటలో అనారోగ్యం ముఖ్య అడ్డంకిగా నిలిచి జనులు తీవ్రమైన రోగములతో బాధ పడుచున్నపుడు, వారి యందు దయతో భరధ్వాజ, ఆత్రేయ, పునర్వసు, నిమి, కాశ్యప, కశ్యప మొదలగు ఋషులు తమ పాలకుడైన ఇంద్రుని దగ్గరకు వెళ్ళిరి. వారి వలన భూలోకములో జనులు అనుభవించుచున్న బాధలను విన్న ఇంద్రుడు వాటి నివారణార్థమై కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ, శల్య, దంష్ట్ర జరా, వృష్య అను ఎనిమిది అంగములు కల ఆయుర్వేదమును వారికి ఉపదేశించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగినది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో వున్నది.

