నార్ల తాతారావు

వికీపీడియా నుండి

నార్ల తాతారావు ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ చైర్మన్.

నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 మార్చి 8వ తేదీన జన్మించాడు. ఎంఎస్‌ డిగ్రీ వరకూ చదివిన తాతారావు మొదట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు సంస్థ (ఏపీఎస్‌ఈబీ) డివిజనల్‌ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మధ్య ప్రదేశ్‌ విద్యుత్తు బోర్డులో పనిచేసిన కాలంలో దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపాడు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శమయ్యాయి. 1974 నుంచి 1988 వరకూ 14 ఏళ్లపాటు ఏపీఎస్‌ఈబీ ఛైర్మన్‌గా పనిచేసాడు. విద్యుత్తు రంగానికి విశిష్ట సేవలందించినందుకుగాను 1983లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించాడు. పేదలకు తక్కువ ధరకే విద్యుత్తు అందజేయాలనేది ఆయన లక్ష్యం. విద్యుత్తుతో వ్యాపారం చేయవద్దనేది ఆయన నినాదం.

నార్ల తాతారావు 2007 ఏప్రిల్ 7 న మరణించాడు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు తాతారావుకు సోదరుడు.

[మార్చు] పురస్కారాలు